News

బాబు పర్యటన వెనుక రహస్యమేమిటో


వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు స్థాయి దిగజారి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడీఎస్‌ పథకం కింద రూ.10వేల కోట్లను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారని నాడు చంద్రబాబు, టీడీపీ నేతలు అన్నారని, ఇప్పుడేం జవాబు చెబుతారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమాలు మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన ఐడీఎస్‌(స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం) అపహాస్యం అయిందని బొత్స అన్నారు. మోసం, అబద్ధాలు, దగా చంద్రబాబు చేసే నిత్యకృత్యాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుకు ముందే ఫ్యూచర్‌ గ్రూప్‌ తో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలు అతి త్వరలోనే బయటకు వస్తాయని బొత్స చెప్పారు. చంద్రబాబు దుబాయ్‌ పర్యటన వెనుక రహస్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబాయ్‌కు చెందిన బీఆర్‌ షెట్టి గ్రూపునకు అమరావతిలో భూకేటాయింపులు జరిగాయని బొత్స చెప్పారు. ఈ సెటిల్‌ మెంట్‌ చేసుకునేందుకే చంద్రబాబు దుబాయ్‌ వెళ్లాడని అన్నారు. ఆ రహస్యాలు కూడా త్వరలోనే బయటపెడతామని చెప్పారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.